అసెంబ్లీని కుదిపేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు
హైదరాబాద్: ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పిపిఎల) వ్యవహారం మంగళవారం శాసనసభను కుదిపేసింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం శాసనసభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తమ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాల విషయంలో తాము తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తానని, రుజువు చేయలేకపోతే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు సవాల్ చేశారు.
పిపిఎల సవరణపై తెలుగుదేశం సభ్యుడు కొత్తపల్లి సుబ్బారాయుడు వేసిన ప్రశ్నలకు విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ ఇచ్చిన సమాధానంతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. పిపిఎల సవరణ కష్టసాధ్యంగా ఉందని, గత తెలుగుదేశం ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని, వాటిని సవరించడానికి ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని షబ్బీర్ అలీ అన్నారు.
పిపిఎలపై సిబిసిఐడి దర్యాప్తు జరిపిస్తామన్నారని, తప్పులు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారని చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తమ మాట నిలబెట్టుకోనందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిదారులకు అనుకూలంగా ఒప్పందాలు కుదుర్చుకుందని, దీని వల్ల ప్రభుత్వానికి 2,500 కోట్ల నష్టం వాటిల్లుతోంందని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
1993లో ప్రస్తుత మంత్రి కె. రోశయ్య విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెక్ట్రమ్, జివికెలతో ఒప్పందాలు కుదుర్చుకుందని, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్పై ప్రభుత్వం దొంగ ఒప్పందం కుదుర్చుకుందని, వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి తమపై దాడి చేస్తున్నారని చంద్రబాబునాయుడు అన్నారు. 22 విద్యుత్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిపి ఎల వ్యవహారంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వాస్తవాలను దాచి పెడుతున్నాయని విమర్శిస్తూ వామపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.