610, పోతిరెడ్డిపాడులపై పట్టు: అసెంబ్లీ స్తంభన
హైదరాబాద్: తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో జరిగిన నష్టాన్ని సవరించడానికి జారీ చేసిన 610 జీవో అమలుపై, పోతిరెడ్డిపాడు పనులపై చర్చకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు పట్టుబట్టడంతో మంగళవారం శాసనసభ కార్యక్రమాలు కొద్దిసేపు స్తంభించాయి. ఈ రెండు అంశాలపై తెరాస వాయిదా తీర్మానాలను ప్రతిపాదించింది. వాటిని స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి తిరస్కరించారు.
ఈ రెండు అంశాలపై తగిన రీతిలో వస్తే చర్చకు అవకాశం కల్పిస్తానని స్పీకర్ చెప్పినా తెరాస సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. 610 జీవోను వెంటనే అమలు చేయాలని, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ప్రాజెక్టు పనులను ఆపేయాలని తెరాస సభ్యులు డిమాండ్ చేశారు. సభా సమావేశాలు ముగిసిన వెంటనే సభ్యులతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు పర్యటన ఏర్పాటు చేసి వాస్తవాలను పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తామని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం మాట తప్పదని ఆయన అన్నారు.