పోతిరెడ్డిపాడు జీవోలో మార్పులుండవు: పొన్నాల
హైదరాబాద్: రాయలసీమలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుతూ జారీ చేసిన 170 నెంబర్ ఉత్తర్వులలో మార్పు వుండబోదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. కొన్ని పదాలను తొలగించి వాటి స్థానంలో ఇతర పదాలను చేర్చామని, పరుష పదజాలం ఉన్న చోట సరళ పదజాలం వాడామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు వల్ల ఇతర ప్రాంతాల జలాల హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతర్రాష్ట్ర జల ఒప్పందాలకు అనుగుణంగానే జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. పోలవరంపై ఒరిస్సా ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం తెలుపుతూ ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి లేఖ రాసిన నేపథ్యంలో లక్ష్మయ్య ఆ వివరణ ఇచ్చారు. నవీన్ పట్నాయక్ రాసిన లేఖ ఇంకా తమకు అందలేదని ఆయన చెప్పారు.