అసెంబ్లీ: బిసిల మేలుపై టిడిపి, బిజెపి వాకౌట్
హైదరాబాద్: వెనకబడిన తరగతుల (బిసిల) సంక్షేమంపై గత మూడు రోజులు జరిగిన చర్చకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులు గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. బిసి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
వెనకబడిన తరగతుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. బిసి కార్పోరేషన్ నిష్ప్రయోజనమని అన్నది. పైగా బిసిల జాబితాను కుదించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. బిసిలకు ఏమైనా మేలు జరిగిందంటే కాంగ్రెస్ వల్లనే జరిగిందని బిసి సంక్షేమ మంత్రి డి. శ్రీనివాస్ అన్నారు. బడ్జెట్ లేకపోవడం వల్ల నిరుడు బిసి విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల చేయలేకపోయామని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఉపకార వేతనాలు ఇవ్వడంతో పాటు పేదలకు ఫీజులు మాఫీ చేస్తామని ఆయన చెప్పారు.
బిసిలపై కాంగ్రెస్ కక్ష కట్టిందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. బిసిల అంశం శాసనసభలో చర్చకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన అన్నారు.