ఆస్తుల వెల్లడికి ఎమ్యెల్యేలకు నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏర్పాటు కాబోయే శాసనమండలి అడ్డుకోకూడదని సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు జి. వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు తాను సవరణ ప్రవేశపెట్టాలని అనుకున్నానని, అయితే సమయాభావం వల్ల ఆ పని చేయలేకపోయానని ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పునరుద్ధరణ బిల్లుపై చర్చలో పాల్గొంటూ అన్నారు. శాసనమండలి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన అన్నారు. శాసనమండలి పునరుద్ధరణను వ్యతిరేకించడం ప్రజల తీర్పును వ్యతిరేకించడమేనని అన్నారు.
శాసనమండలి బిల్లును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు రవీంద్ర నాయక్ సమర్థించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఈ బిల్లును ప్రవేశపెడుతున్నందున దాన్ని సమర్థిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన యుపిఎ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి బిల్లు వస్తే శాసనమండలి బిల్లును సమర్థించినట్లుగానే సమర్థించాలని ఆయన బిజెపిని కోరారు. శాసనమండలి ఏర్పాటు వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకం ఏర్పడదని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని, అలాగే రెండు శాసనమండళ్లు కూడా ఏర్పాటవుతాయని ఆయన అన్నారు.
శాసనమండలి పునరుద్ధరణకు తాము మొదటి నుంచీ తాము వ్యతిరేకమేనని సిపిఐ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తాము బిల్లును సమర్థిస్తామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పునరుద్ధరణ బిల్లుపై గురువారం లోక్సభలో చర్చ ప్రారంభమైంది. తెలుగుదేశం, సిపియం శాసనమండలి పునరుద్ధరణను తీవ్రంగా వ్యతిరేకించాయి. శాసనమండలి పునరుద్ధరణ వల్ల ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పడుతుందని ఈ పార్టీలు వాదించాయి. శాసనమండలి ఆరో వేలు వంటిదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత కె. ఎర్రంనాయుడు అన్నారు. శాసనమండలి వల్ల ఒరిగేదేమీ లేదని, అది సలహాలు ఇచ్చే వ్యవస్థ మాత్రమే అని, అందువల్ల దాని వల్ల ఏ ఉపయోగమూ ఉండదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుల రాజకీయ పునరావాసానికి మండలి పునరుద్ధరణకు పూనుకున్నారని ఆయన అన్నారు.
బిజెపి సభ్యుడు విక్రమ్ కేశూ దేవ్ శాసనమండలి పునరుద్ధరణ బిల్లును సమర్థించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. శాసనమండలిని రద్దు చేయడం అప్రజాస్వామిక చర్య అని కాంగ్రెస్ సభ్యుడు కె. యస్. రావు అన్నారు. ఈ సమయంలో ఎన్.టి. రామారావు పాలన తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం సభ్యులు అభ్యంతరపెట్టారు. పెద్ద రాష్ట్రాల్లో శాసనమండలి అవసరమని సమాజ్వాదీ పార్టీ సభ్యుడు మోహన్ సింగ్ అన్నారు. శాసనమండలి రద్దు అప్రజాస్వామికమని, పునరుద్ధరణ ఖజానాకు భారమేమీ కాదని ఆయన అన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతాలు సహా అన్ని రాష్ట్రాల్లో శాసనమండళ్లు ఉండాలని డియంకె సభ్యుడు కదీర్ మొహిదీన్ అన్నారు. శాసనమండలి పునరుద్ధరణను బిజెడి సభ్యుడు భర్తృహరి మెహతాబ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ మండలి పునరుద్ధరణకు పూనుకుందని, ఈ ఒక్క హామీని తప్ప కాంగ్రెస్ మరే హామీలను అమలు చేయబోదని ఆయన అన్నారు.