అనంతలో 4గురు హతం: శ్రీకాకుళంలో మందుపాతర
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. అనంతపురం జిల్లా మర్రికొమ్మదిన్నె వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో ముగ్గురు పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్ బుధవారం సాయంత్రం జరిగింది. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని పెన్నా ఏరియా మావోయిస్టు కమిటీ కార్యదర్శి గంగారామ్ విమర్శించారు.
రామగిరి నుంచి మద్దిలేరి దళంలోకి వెళ్తుండగా పట్టుకొని పోలీసులు నలుగురిని కాల్చి చంపారని ఆయన అన్నారు. మరణించినవారిలో క్రిష్ణ, నారాయణ, ముత్యాలు ఉన్నట్లు గంగారామ్ తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురి ప్రాణాలకు హాని జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందని, తాము భౌతిక దాడులకు దిగాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, శ్రీకాకుళం జిల్లా భామిని జంక్షన్కు సమీపంలోని నివిది వద్ద పోలీసులు భారీ నక్సల్స్ మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు. 24 కిలోల మందుపాతరను, లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు పెద్ద యెత్తున్న కూంబింగ్ చేపట్టారు. ప్రైవేట్ వాహనాలు అటవీ ప్రాంతంలోకి వస్తే పేల్చివేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు.
కాగా, వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం కాటారంలో జగదీష్ అనే హోంగార్డును హత్య చేశారు. మావోయిస్టులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా బొమ్మన్పల్లి వద్ద మావోయిస్టులు రఫీక్ అనే ఆర్యంపిని హత్య చేశారు. బొమ్మన్పల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.