క్రికెట్: శ్రీలంకపై భారత్ సిరీస్ విజయం
అహ్మదాబాద్: శ్రీలంక క్రికెట్ జట్టుపై భారత జట్టు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 2-0 స్కోర్తో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్లో జరిగిన చివరి టెస్టులో భారత్ శ్రీలంకపై 259 పరుగుల భారీ ఆధిక్యతతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, హర్బజన్ సింగ్ శ్రీలంక బ్యాట్స్మెన్ పాలిటి శాపంగా మారి భారత్కు విజయాన్ని అందించారు. అహ్మదాబాద్ టెస్టులో పది వికెట్లు తీసిన హర్బజన్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ చేసి నిలకడగా రాణించిన అనిల్ కుంబ్లే మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికయ్యాడు.
భారత్ ఉంచిన 509 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్లో 249 పరుగులకు చేతులెత్తేసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసిన శ్రీలంక గురువారం ఆర గంట లోపలే మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్ మాంత్రికులు ఇద్దరు 7.3 ఓవర్లలోనే మిగతా నాలుగు వికెట్లు తీసి భారత్కు సునాయసమైన విజయాన్ని అందించారు. ఈ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
తన క్రికెట్ జీవితంలో వందో టెస్టు ఆడిన అనిల్ కుంబ్లే టెస్టు మ్యాచ్ను గొప్పగా ఎప్పుడూ గుర్తుండేలా చేసుకున్నాడు. శ్రీలంక చివరి వికెట్ మాలింగ బండారాను అవుట్ చేయడం ద్వారా తన కెరీర్లో 31వ సారి ఐదు వికెట్లు తీసుకున్న ఘనత సాధించారు. మరో 15 వికెట్లు తీసుకుంటే కుంబ్లే 500 వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో చేరిపోతాడు. రెండో ఇన్నింగ్స్లో హర్బజన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
చెన్నైలో జరిగిన మొదటి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది.