6గురి నరికివేతతో రుద్రాక్షపల్లిలో ఉద్రిక్తత
ఖమ్మం/హైదరాబాద్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రామారావు అనే పాత నేరస్థుడి ముఠా గ్రామస్థులపై వేటకొడవళ్లతో దాడి చేసి ఆరుగురిని హతమార్చింది. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది.
ఆగడాలను భరించలేక గతంలో గ్రామస్థులు నాగేశ్వరరావు అనే రౌడీ షీటర్ను హతమార్చారు. ఈ సంఘటన నాగేశ్వరరావు అన్న రామారావులో ప్రతీకారం రగల్చింది. వరంగల్ సబ్ జైలులో దొంగతనం కేసులో ఉన్న రామారావు విడుదల కావడంతోనే పథకం రచించి తన ఏడుగురి అనుచరులతో గురువారం రాత్రి గ్రామంపై విరుచుకుపడ్డాడు.
దొరికినవారిని దొరికినట్లు రామారావు అనుచరుల ముఠా నరికే ప్రయత్నం చేసింది. ఎవరినీ వదలలేదు. ఈ సంఘటనలో ఆరుగురు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. పరిస్థితి భయానకంగా ఉంది. రాత్రి కొంత మంది పారిపోయారు. పారిపోయినవారు ఈ ఉదయం తిరిగి గ్రామానికి వచ్చారు. పోలీసులు రామారావు కోసం గాలిస్తున్నారు.
రుద్రాక్షపల్లి బాధితులకు యాబై వేల రూపాయలేసి ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు హోం మంత్రి కె. జానారెడ్డి హైదరాబాద్లో చెప్పారు. రుద్రాక్షపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన చెప్పారు.