టీచర్ హత్యపై నిరసన: చర్యలకు జానా హామీ
ఆదిలాబాద్/ హైదరాబాద్: ప్రేమ పేరుతో గంగాభవానీ అనే ఉపాధ్యాయురాలిని సతీష్ అనే ఉన్మాది నరికి చంపిన సంఘటనపై గురువారం ఆదిలాబాద్ జిల్లాలో నిరసన వెల్లువెత్తింది. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో సతీష్ అనే యువకుడు గంగాభవానీ అనే ఉపాధ్యాయురాలని దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే.
జిల్లాలోని ఉపాధ్యాయులు గురువారంనాడు తరగతులు బహిష్కరించి ప్రదర్శనలు నిర్వహించారు. విద్యాశాఖ, పోలీసు శాఖ నిర్లక్ష్యం వల్లనే గంగాభవానీ హత్యకు గురయ్యారని ఉపాధ్యాయులు ఆరోపించారు. గంగా భవానీ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఆమెకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గంగాభవానీ హత్య ఘటనలో బాధ్యులైనవారిపై తగిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి కె. జానా రెడ్డి గురువారం హైదరాబాద్లో చెప్పారు. గంగాభవానీ హత్య ఘటన వంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తనకు హోం మంత్రి జానా రెడ్డి హామీ ఇచ్చారని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి ఎన్. రాజ్యలక్ష్మి మీడియా ప్రతినిధులతో చెప్పారు.