గంగూలీ వివరణ అడగబోం: నిరంజన్ షా
ముంబాయి: గత రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడకపోవడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని వివరణ అడిగేందుకు ప్రయత్నించడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి నిరంజన్ షా స్పష్టం చేశారు. వివరణ అడుగుతూ ఎవరికీ లేఖ రాయబోవడం లేదని, గంగూలీ ఆడకపోతే తాము చేయగలిగేదేమిటని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో గంగూలీ ఆడకపోవడంపై సెలెక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై ఆయన ప్రతిస్పందించారు. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్కు జట్టు నుంచి గంగూలీని తొలగించారు. అయితే త్వరలో పాకిస్థాన్తో జరిగే మూడు టెస్టు మ్యాచ్ల జట్టులోకి ఆయనను తీసుకున్నారు.
ఇదిలావుంటే, గంగూలీ సోమవారంనాడు కోల్కత్తాలో ప్రాక్టీస్ చేశాడు. గంగూలీ ఈడెన్ గార్డెన్లోనూ, పక్కనే ఉన్న పంకజ్ గుస్తా ఇండోర్ శిక్షణా కేంద్రంలోనూ గంటన్నర సేపు గడిపారు. అయితే మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు.