బెంగుళూర్ సంఘటనలు జరగనివ్వం: జానా
హైదరాబాద్/విజయవాడ: బెంగుళూర్ లాంటి సంఘటనలు హైదరాబాద్లో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను రప్పిస్తామని ఆయన హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. బెంగుళూర్లోని సైన్స్ సెంటర్పై బుధవారంనాడు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడి వెనక లష్కర్ - ఎ - తోయిబా హస్తం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
హైదరాబాద్లో బెంగుళూర్లో జరిగినటువంటి సంఘటనలను జరగనివ్వమని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ విజయవాడలో చెప్పారు. కాలచక్ర, ప్రవాస భారతీయ దివస్, ఎఐసిసి ప్లీపరీ, సైన్స్ కాంగ్రెస్లకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి అదనపు బలగాలను రప్పిస్తామని ఆయన చెప్పారు. బౌద్ధ గురువు దలైలామాకు ఉన్న ముప్పు దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు.
మావోయిస్టులను ఎదుర్కోవడానికి ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఆయుధాలు సరిపోతాయని ఆయన అన్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి బలగాలను రప్పిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టులు ప్రయోగిస్తున్న రాకెట్ లాంచర్లు అంత బలమైనవి కావని, వాటి వల్ల ముప్పేమీ లేదని ఆయన అన్నారు. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగిన భద్రతా ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.