నేను హనుమంతుడిని: వెంకయ్యనాయుడు
ముంబాయి: తాను పార్టీ హనుమంతుడ్ని అని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. తాను రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రకటిస్తూ అద్వానీ, ప్రమోద్ మహాజన్లను పార్టీ రామలక్ష్మణులుగా అభివర్ణించడంపై వెంకయ్యనాయుడు మీడియా ప్రతినిధుల వద్ద శుక్రవారం ఆ విధంగా ప్రతిస్పందించారు.
అద్వానీ, మహాజన్లను వాజ్పేయి రామలక్ష్మణులుగా అభివర్ణించడాన్ని మీరు సమ్మతిస్తారా అని అడిగితే తనకు ఎవరితోనూ సమస్య లేదని, తన వరకు వస్తే తాను పార్టీకి అంకితమైన హనుమంతుడ్ని అని ఆయన సమాధానమిచ్చారు. వాజ్పేయి, అద్వానీ పదవిలో ఉన్నా లేకున్నా పార్టీకి మార్గదర్శనం చేస్తూనే ఉంటారని, వారి మార్గదర్శనం నుంచి తాము లబ్ధి పొందుతామని ఆయన అన్నారు.
లక్ష్మణుడి ప్రాణాలను కాపాడడానికి హనుమంతుడు సంజీవిని తెచ్చిన విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా వెంకయ్యనాయుడు నవ్వి ఊరుకున్నారు.