వైయస్కు వేయి కోట్ల ముడుపులు: సిపియం
మహబూబ్నగర్/ హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి వేయి కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు మహబూబ్నగర్లో ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 60 టియంసిల నీరు విడుదల చేస్తూ జీవో జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
కర్ణాటక రాష్ట్రానికి పరిహారం చెల్లించి జూరాల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిలువ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పేదలందరికీ తెల్లరేషన్ కార్డులు ఇచ్చేంతవరకు తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం కన్నా వేగంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని సిపియం శాసనసభ్యుడు గఫూర్ మంగళవారం హైదరాబాద్లో విమర్శించారు. తెలుగుదేశం కన్నా భిన్నమైన పాలనను, విధానాలను అందిస్తుందనే నమ్మకంతో తాము కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేశామని, కానీ ప్రభుత్వం తమ నమ్మకాన్ని వమ్ము చేస్తోందని ఆయన అన్నారు. సంస్కరణల పేరుతో పేదలపై భారం వేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు.