ప్రయోగాలు కొనసాగుతాయి: చాపెల్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ పర్యటన సందర్భంగా కూడా తమ జట్టు విషయంలో ప్రయోగాలు కొనసాగుతాయని భారత క్రికెట్ జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ చెప్పారు. పాకిస్థాన్ పర్యటన తమకు సవాలేనని చాపెల్తో పాటు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. గురువారంనాడు పాకిస్థాన్ పర్యటనకు బయలుదేరే ముందు వీరివురు కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.
భారత కోచ్గా పాక్ పర్యటన చేయడం గొప్ప గౌరవమని, ఇటీవలి కాలంలో తాను పాక్లో పర్యటించలేదని, ఇప్పుడు ఆ అవకాశం దక్కిందని, అందువల్ల ఈ పర్యటనకు తనకు ప్రత్యేకమైందని, విజయంతో తిరిగి వస్తామని ఆశిస్తున్నామని చాపెల్ అన్నారు. ఏదో ఒక ఆటగాడిపై దృష్టి కేంద్రీకరించడమనేది సరైనది కాదని ద్రావిడ్ అన్నారు. పాక్కు సంబంధించి ఒకరిద్దరు ఆటగాళ్లను లక్ష్యం చేసుకోవడమనేది తప్పని, పాకిస్థాన్ పటిష్టంగా ఉందని, వారు బాగా ఆడుతున్నారని, పోటీ హోరాహోరీగానే ఉంటుందని ఆయన అన్నారు.
భారత్దే పైచేయి అవుతుందనే పాక్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రకటనతో ద్రావిడ్ ఏకీభవించలేదు. ఒకరు ఫేవరెట్, మరొకరు కాదనేది ఏదీ ఉండదని ఆయన అన్నారు. పాక్ పేస్ బౌలర్లతో భారత పేస్ బైలర్లను పోల్చే పద్దతిని చాపెల్ వ్యతిరేకించారు. బౌలర్ల మధ్య పోలిక సరైంది కాదని, ఎవరి పద్ధతి వారిదని ఆయన అన్నారు.