ముజీబ్కు క్షమాభిక్షపై పరిశీలన: జానారెడ్డి
హైదరాబాద్: ముస్లిం తీవ్రవాది ముజీబ్కు క్షమాబిక్ష పెట్టిన విషయమై పరిశీలన జరుపుతామని రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. తనకు క్షమాభిక్ష పెట్టిన విషయంలో సంస్థల, వ్యక్తుల ఒత్తిడి ఉందని ముజీబ్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పరిశీలన జరుపుతామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ముజీబ్ క్షమాభిక్షను రద్దు చేసే విషయంపై కూడా పరిశీలన జరుపుతామని ఆయన చెప్పారు. నక్సల్స్కు, ఇతర తీవ్రవాద సంస్థలకు మధ్య ఉన్న సంబంధాలపై పరిశీలన జరుపుతామని ఆయన చెప్పారు. ముజీబ్కు క్షమాభిక్ష పెట్టిన సంఘటనకు సంబంధించి తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, కేంద్ర ఇంటలిజెన్స్ ఛీప్ నర్సింహన్ గురువారంనాడు హోం మంత్రి కె. జానారెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్, నల్లగొండల్లో ముస్లిం తీవ్రవాదుల కార్యకలాపాలు బయటపడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది.