పాలార్పై ఆంధ్ర ప్రాజెక్టుకు జయ వ్యతిరేకం
చెన్నై: చిత్తూరు జిల్లా కుప్పంలో పాలారు నదిపై రిజర్వాయర్ను నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యతిరేకించారు. ఈ మేరకు ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఒక లేఖ రాశారు. పాలార్పై ప్రాజెక్టును నింపి నీటిని నిల్వ చేయడం అంతర్రాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధమని ఆమె అన్నారు.
పాలారు నదిపై ప్రాజెక్టు నిర్మిస్తే తమిళనాడు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అంతేకాకుండా ఉత్తర తమిళనాడులోని ప్రజలకు మంచినీటి కొరత కూడా ఏర్పడుతుందని ఆమె అన్నారు. దిగువ రాష్ట్రం అంగీకారం లేకుండా పాలార్ నదిపై డ్యామ్ను లేదా ఇతర నిర్మాణ్నాన్ని చేపట్టడం, నీటిని మళ్లించడం లేదా నిల్వ చేయడం అంతర్రాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధమని ఆమె అన్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడుకు ఏ విధమైన ప్రతిపాదనలు సమర్పించలేదని, సమాచారం కూడా అందించలేదని జయలలిత అన్నారు. పాలార్ నదిపై ప్రాజెక్టు నిర్మించే ఆలోచన ఏదైనా ఉంటే విరమించుకోవాలని ఆమె రాజశేఖర్ రెడ్డిని కోరారు.