పోలవరంపై అఖిల పక్ష సమావేశం రసాభాస
హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం రసాభాసగా మారింది. సమావేశం అర్థాంతరంగా వాయిదా పడింది. ఈ సమావేశాన్ని తిరిగి ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, నిర్వాసితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని సిపియం డిమాండ్ చేసింది. సమావేశం ముగిసే వరకు ప్రాజెక్టు పనులు ఆపేయాలని సిపియం డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దీంతో సిపియం సమావేవం నుంచి వాకౌట్ చేసింది. మిగతా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. ఒకేసారి ఇటు ప్రతిపక్షాల నాయకులు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడడం సాగించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే చాలా సమయం అయిందంటూ ప్రభుత్వం సమావేశాన్ని ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
ప్రాజెక్టు పనులు ఎంత వరకు జరిగాయో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనభ్యుడు నాయని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తొందని ఆయన విమర్శించారు.