అద్వానీ ఫోన్ను కూడా ట్యాప్ చేశారు: బిజెపి
న్యూఢిల్లీ: తమ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆరోపించింది. వోకర్ నివేదికపై వివాదం చెలరేగుతున్న సమయంలో అద్వానీ ఫోన్ను ట్యాప్ చేశారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా తీవ్రమైన విషయమని, దీనిపై దర్యాప్తు జరగాలని, రాజకీయ పార్టీల నాయకులందరూ సమావేశమై ఏ విధమైన విచారణ అవసరమనే విషయాన్ని నిర్ణయించడం అవసరమని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలన్నీ ఏ విచారణను కోరితే ఆ విచారణ జరిపించడం అవసరమని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
తమ పార్టీ అధ్యక్షుడి ఫోన్ ట్యాప్ అయిందని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జావేద్కర్ ఢిల్లీలో చెప్పారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడి ఫోన్ ట్యాప్ అవుతోందా, గత అధ్యక్షుడి ఫోన్ ట్యాప్ అయిందా అనే విషయాన్ని ఆయన కచ్చితంగా చెప్పలేదు.