తెలంగాణ, సీమ అభివృద్ధి జరగాలి: రాష్ట్రపతి
భీమవరం: ఆంధ్రప్రదేశ్లోని కోస్తాలో జరిగిన వ్యవసాయాభివృద్ధి రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో జరగాలని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ అభిప్రాయపడ్డారు. దేశంలో రెండో హరిత విప్లవం సాధించాలని, అందుకు శాస్త్ర సాంకేతికాభివృద్ధిని వాడుకోవాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. భీమవరంలో బైర్రాజు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సోమవారంనాడు ప్రసంగించారు.
వ్యవసాయోత్పత్తులకు అదనపు విలువ వచ్చేలా పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. గ్రామాలను పట్టణాల స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. 108 అంబులెన్స్ సర్వీసును ఆయన ప్రారంభించారు. పట్టణాల్లో మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు పెరగడానికి ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలు కలిసి పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యవసర సేవలు గ్రామాలకు కూడా అందాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.
విష్ణు ఎడ్యుకేషన్ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఇది తన కార్యక్రమంలో లేనప్పటికీ కాన్వాయ్ని వెనక్కి తిప్పి ఆయన విద్యార్థులతో మాట్లాడారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని ఆయన విద్యార్థులకు ఉద్భోదించారు.