యుపిఎతో తెలంగాణ రాష్ట్రం కల్ల: వెంకటస్వామి
హైదరాబాద్: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పెద్దపల్లి లోక్సభ సభ్యుడు జి. వెంకటస్వామి అన్నారు. రెండో ఎస్సార్సీకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అంగీకరించలేదని ఆయన మంగళవారం ఒక కార్యక్రమంలో అన్నారు. తెరాస ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని విరమించుకుని అభివృద్ధి కోసం ఉద్యమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి ఉందని, అయితే సంకీర్ణం ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం వీలు కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, వారికి 64 సీట్లు ఉన్నాయని, యుపిఎ వారి మద్దతుతో కొనసాగుతున్నదని, అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఆయన వివరించారు. సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడే వరకు తెలంగాణ రాష్ట్రం రాదని ఆయన అన్నారు.