గాంధీ వైద్యుల నిర్వాకంతో బయటే ప్రసవం
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఒక మహిళ గాంధీ అస్పత్రి వెలుపలే ప్రసవించింది. నల్లగొండ జిల్లా తుర్కపల్లికి చెందిన దుర్గ అనే గర్భిణీ స్త్రీని చేర్చుకోవడానికి వైద్యులు లంచం అడిగితే గానీ చేర్చుకోమని చెప్పారు. దీంతో ఆ మహిళ రాత్రంతా వెలుపలే పడిగాపులు పడి ఆస్పత్రి వెలుపలే ప్రసవించింది.
మొదట తుర్కపల్లిలో లభించిన వైద్య సలహా మేరకు ఆ మహిళను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే వారు తుర్కపల్లి వైద్యుడు రాసిచ్చిన చీటి తీసుకురావడం మర్చిపోయారు. దీంతో ఒకసారి చీటీ లేదని, మరోసారి రక్తం కావాలని సాకులు చెబుతూ ఆ మహిళను చేర్చుకోలేదు.
అయితే తమ నిర్లక్ష్యమేదీ లేదని గాంధీ ఆస్పత్రి గైనకాలజిస్టు అంబుజ అంటున్నారు. తాము ఆ మహిళను ఏడున్నర గంటలకు లేబర్ రూమ్కు తీసికెళ్లామని, తాము అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకుని వచ్చే లోగా ఆ మహిళ లేదని, బెడ్లన్నీ తరిచి చూశామని, ఆమె ఎక్కడా కనిపించలేదని, ఈలోగా ఎవరో వచ్చి ప్రసవం సంగతి చెప్పారని, వెంటనే తమ సిబ్బంది ట్రాలీ మీద ఆ మహిళను తీసుకొచ్చారని ఆమె వివరించారు.
ఈ సంఘటనపై విచారణ జరిపిస్తున్నామని ఆస్పత్రి సూపరింటిండెంట్ ఎ.వై. చారి చెప్పారు. అవినీతికి సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ఒక కమిటీని కూడా వేశామని ఆయన చెప్పారు.