తేలేవరకు అభివృద్ధి బాధ్యత మాదే: డియస్
విజయవాడ: ప్రత్యేక తెలంగాణపై ఏదో ఒకటి తేలేవరకు తెలంగాణ ప్రాంత అభివృద్ధిని చేపట్టాల్సిన బాధ్యత తమదేనని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణపై తలో మాట మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్ర సమితిలోని విభేదాల ఫలితమే ఇది అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని తమ పార్టీ అధినేత సోనియా గాంధీకి అప్పగించినందున ఈ అంశంపై ఎవరూ ప్రకటనలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు.
మొదటి ఎస్సార్సీని గౌరవిస్తూ రెండో ఎస్సార్సీకి తమ పార్టీ తెరాసతో జరిగిన ఒప్పందంలో అంగీకరించిందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడుతుందనేది చెప్పలేమని ఆయన అన్నారు. దైనికైనా ప్రజల్లో భావన రావాలని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము తెలంగాణ రాష్ట్రం అడిగామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్కు గల కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆ కారణాలు లేని పరిస్థితి వస్తుందా, లేదా అనేది ఇప్పుడు చెప్పలేమని, అయితే తెలంగాణ అభివృద్ధి బాధ్యత తమదేనని ఆయన అన్నారు.