ప్లీనరీ ఏర్పాట్లపై విమర్శలు అర్థరహితం: సోనీ
హైదరాబాద్: తమ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావు, కాంగ్రెస్ అంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మోతీలాల్ వోరాలతో పాటు ఆమె శుక్రవారంనాడు హైదరాబాద్లోని ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
హంగూ ఆర్భాటం లేకుండా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని అంబికా సోనీ ఈ సందర్భంగా మీడీయా ప్రతినిధులతో చెప్పారు. ప్లీనరీలో ప్రతిపాదించే నాలుగు తీర్మానాలను సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. ప్లీనరీ ఏర్పాట్ల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక సమావేశం కానున్నదని ఆమె చెప్పారు. ప్రతినిధులకు బస ఏర్పాటు చేసే కొండాపూర్లోని అతిథి గృహాన్ని, కూకట్పల్లిలోని ఫ్లాట్ను కూడా వారు పరిశీలించారు.