హజ్ తొక్కిసలాటలో 3గురు హైదరాబాదీల మృతి
దుబాయ్: హజ్ యాత్ర తొక్కిసలాటలో మరణించినవారిలో ముగ్గురు హైదరాబాదీలు ఉన్నట్లు సమాచారం అందింది. హజ్ యాత్ర తొక్కిసలాటలో మొత్తం 354 దాకా మరణించినట్లు, వేయి మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో 27 మంది భారతీయులు ఉన్నారు. 13 మంది భారతీయులు గాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన హనీఫ్ ఉన్నిసాబేగం (హుమాయన్ నగర్), మహ్మద్ బహావుద్దీన్ (సైదాబాద్), అబూ షుకూర్ (హయత్నగర్) మరణించినట్లు గుర్తించారు. రాష్ట్ర మంత్రి ఫరీదుద్దీన్ మక్కాలో పరిస్థితి సమీక్షిస్తున్నారు.
మరణించిన భారతీయుల్లో 12 మంది ఉత్తరప్రదేశ్కు, ముగ్గురేసి మంది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లకు, ఇద్దరేసి కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు, ఒకరు పశ్చిమ బెంగాల్కు చెందినవారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని కాన్సుల్ జనరల్ సయాద్తో పాటు ఇతర సీనియర్ అధికారులు పరామర్శించారు. యాత్రికుల కోసం మినా క్యాంపు వద్ద ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.