ఈసారి బిల్లు తేకుంటే తప్పుకుంటాం: కెసిఆర్
వరంగల్: ఆసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లును తేకపోతే ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) నుంచి తప్పుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత, కేంద్రమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. వరంగల్లో సోమవారం జరిగిన పార్టీ ఉత్తర తెలంగాణ శాసనసభ్యులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ జాగరణ సేన మహాసమ్మేళన్ను ఫిబ్రవరిలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ నెలలో, వచ్చే నెలలో తెలంగాణను సమర్థించే పార్టీలతో ఒత్తిడి తేచ్చి అమీతుమీ తేల్చుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న తిరుగుబాటు శాసనసభ్యులకు రాళ్లతో కొట్టి ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు.
తెలంగాణ కోసం ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ మరో అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. తెలంగాణ అంశం అటో ఇటో తేలి పోయే సమయం వచ్చిందని ఆయన అన్నారు. సమైక్యవాదులతో కలిసిపోయి తెలంగాణ ద్రోహం చేస్తున్న ముగ్గురు అసమ్మతి పార్టీ శాసనసభ్యులకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శాసనసభ సభ్వత్యాలకు రాజీనామాలు చేయండి, ఏ పార్టీ టికెట్ ఇస్తుందో చూస్తామని ఆయన అసమ్మతి శాసనసభ్యులకు సవాల్ విసిరారు. అభివృద్ధి పేరుతో సమైక్యవాదులు తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సహనాన్ని పరీక్షిస్తున్నాయని ఆయన అన్నారు.