వర్గీకరణ అవసరం: గొల్లపల్లితో విభేదించిన కోనేరు
హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సి) రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు అన్నారు. సీనియర్ మంత్రిగా తన అనుభవంతో ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని తాను చెబుతున్నానని ఆయన అన్నారు. వర్గీకరణ అవసరం లేదని మంత్రి గొల్లపల్లి సూర్యారావు చేసిన ప్రకటనను ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల వద్ద ఖండించారు.
గొల్లపల్లి సూర్యారావుతో తనకు విభేదాలు లేవని, అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. అన్నదమ్ముల మధ్య అభివృద్ధిలో తేడా ఉందని, ఈ తేడాను సరిచేయడానికి ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని ఆయన అన్నారు. వర్గీకరణ వల్ల ఎస్సిల సమైక్యతకు, ఏకతకు ఏ విధమైన భంగం వాటిల్లదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలను స్తంభింపజేస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యంఆర్పియస్) నాయకుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. అయితే ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కృష్ణ జరుపుతున్న పోరాటాన్ని తాను సమర్థిస్తున్నానని ఆయన చెప్పారు.