తెలంగాణ వస్తుందో, రాదో చెప్పలేను: రఘువంశ్
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో చెప్పలేనని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి, తెలంగాణపై ఏర్పాటయిన యుపిఎ సబ్ కమిటీ సభ్యుడు రఘువంశప్రసాద్ సింగ్ అన్నారు. నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలోని రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థను ఆయన సోమవారం నాడు సందర్శించారు. డియన్ఎ టెస్టు లాబొరేటరీని ఆయన ప్రారంభించారు.
తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరిని తెలియజేయలేదని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి), బిజెడిలు కూడా తమ వైఖరిని తెలియజేయలేదని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటును వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. తెలంగాణపై వైఖరి తెలియజేయాలని తాము అన్ని పార్టీలకు లేఖలు రాశామని, కొన్ని పార్టీలు తమ వైఖరులను తెలియజేయలేదని, కొన్ని పార్టీలు తెలియజేశాయని ఆయన చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమైతే తెలంగాణ డిమాండ్, నక్సలిజం ఉండవని ఆయన అన్నారు. దారిద్య్రం, నిరుద్యోగం అన్ని సమస్యలకు కారణాలని ఆయన అన్నారు.