13 జిల్లాల్లో ఉపాధి హామీ పథకం: షబ్బీర్
హైదరాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి షబ్బీర్ అలీ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. 13000 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ పథకం అమలు వచ్చే 2వ తేదీ నుంచి అమలవుతుందని ఆయన చెప్పారు.
జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు ఎంపిక చేసిన జిల్లాల్లో 9 తెలంగాణ ప్రాంతానికి చెందినవేనని ఆయన అన్నారు. ఇందిరమ్మ పథకానికి, జాతీయ ఉపాధి హామీ పథకానికి విస్తృత ప్రచారం కల్పించి వాటిని ప్రజల్లో తీసికెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే గ్రామసభల్లో వచ్చే నెల 6 నుంచి 12వ తేదీ వరకు మంత్రులు పాల్గొనాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
నెల్లూరు జిల్లా తడ వద్ద ఆడిడాస్ షూ కంపోనీ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను సింగపూర్కు చెందిన అపాచీ కంపెనీకి 315 ఎకరాల భూమిని కేటాయిస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. అలాగే సత్యం కంప్యూటర్స్కు ఎకరానికి 10 లక్షల రూపాయల ధరకు భూమిని కేటాయించాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.