తెలంగాణ ఎడారి పాపం వైయస్, బాబులది: కెసిఆర్
మెదక్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు విమర్శించారు. మంగళవారంనాడు మెదక్ జిల్లా రామాయంపేటలో ఏర్పాటయిన పార్టీ పశ్చిమ తెలంగాణ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో 30 వేల ఎకరాలకు ఒక టియంసి నీటిని, ఆంధ్రాలో ఆరు వేల ఎకరాలకు ఒక టియంసి నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరీటం పోయిన తర్వాత చంద్రబాబుకు గోదావరి జలాలు, చేనేత కార్మికుల సమస్యలు గుర్తుకొస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి ప్రధానం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ప్రధానమి తెరాస మరో అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. పదువులకు రాజీనామా చేసి వారికిష్టమైన పార్టీల్లో చేరాలని ఆయన పార్టీ అసమ్మతి శాసనభ్యులకు సవాల్ విసిరారు. పార్టీలో మనస్పర్థలను, కలతలను సరిదిద్దుకుంటామని మాజీ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి అన్నారు. తాను చంద్రశేఖర్ రావు ఆదేశాలను శిరసా వహిస్తానని చెప్పారు.
తెలంగాణ జాగరణ సేన కార్యకర్తలు తెరాస రాష్ట్ర కార్యదర్శి రవీందర్ రెడ్డిపై దాడి చేశారు. అయితే తాము ఆయనను గుర్తించలేదని వారు తర్వాత వివరణ ఇచ్చాకున్నారు.