మనస్తాపంతోనే వరంగల్ సభకు గైర్హాజరు: మందాడి
వరంగల్: అనారోగ్యం, మనస్తాపం వల్లనే సోమవారం వరంగల్లో జరిగిన పార్టీ ఉత్తర తెలంగాణ కార్యకర్తల సమావేశంలో పాల్గొనలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి చెప్పారు. శాసనసభ పక్ష సమావేశానికి హాజరై, వరంగల్ సభకు హాజరు కాకపోవడం వ్యూహంలో భాగం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. మందాడి వరంగల్ సభకు హాజరు కాకపోవడం తమ వ్యూహంలో భాగమని పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు దుగ్యాల శ్రీనివాస రావు అన్నారు. ఈ దృష్ట్యా మందాడి సత్యనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు.
అనారోగ్యం కన్నా మనస్తాపమే సభకు హాజరు కాకపోవడానికి ఎక్కువ కారణమని మందాడి సత్యనారాయణ రెడ్డి చెప్పారు. ఇక్కడే తన దిష్టిబొమ్మలు తగులబెట్టారని, తనను బండబూతులు తిట్టారని, అనరాని మాటలన్నారని, దీంతో తాను తీవ్రంగా మనస్తాపం చెందానని, వరంగల్లోని ఒక వర్గం తనను అవమానించే పనికి పూనుకుందని ఆయన చెప్పారు. తనను అవమానించినవారితో పాటు వేదికను పంచుకోవడం కష్టంగా తోచిందని, ఆ విషయాన్ని తాను శాసనసభ్యుల సమావేశంలో తమ పార్టీ అగ్రనేత కె. చంద్రశేఖర్ రావు కూడా చెప్పానని ఆయన అన్నారు.