ధరంసింగ్ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట
బెంగుళూర్: కర్ణాటకలో ధరంసింగ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ప్రస్తుతానికి గండం తప్పింది. వచ్చే నెల 2వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించిన తర్వాతనే సంకీర్ణానికి మద్దతు విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని జెడియస్ నేత దేవెగౌడ్ చెప్పారు. బిజెపితో జోడీ కట్టే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలోని ధరంసింగ్ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. ధరంసింగ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటూ మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్- ఎస్ (జెడియస్) గవర్నర్ను కలిసి లేఖను అందజేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ముఖ్యమంత్రి ధరంసింగ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే తన ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని ధరంసింగ్ అంటున్నారు. ఆయన బుధవారంనాడు గవర్నర్ను కలిశారు.
ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు బెంగుళూర్ చేరుకుని జెడియస్ నేతలతో మంతనాలు ప్రారంభించారు. బిజెపి సహకారంతో జెడియస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమవుతన్న సూచనలు కనిపిస్తున్నాయి. దేవేగౌడ మాత్రం బిజెపితో చేతులు కలపడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పార్టీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని వెంకయ్యనాయుడు చెప్పారు. ఏం జరుగుతుందనేది తెలుసుకుంటున్నామని ఆయన చెప్పారు. జెడియస్ తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.