ప్లీనరీకి ప్రియాంక రావడం లేదు: అంబికా సోనీ
హైదరాబాద్: ప్లీనరీకి సోనియా గాంధీ కూతురు ప్రియాంకను ఆహ్వానించామని, అయితే ఆమె రావడం లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధికార ప్రతినిధులు అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తమ ప్లీనరీ ఏర్పాట్లపై వారు శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒకే విమానంలో హైదరాబాద్ వస్తున్నట్లు వారు తెలిపారు.
రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ తమ పార్టీ సభ్యుడని, యువతకు ప్రతినిధి అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి ధరంసింగ్ తాను శాసనసభ విశ్వాసాన్ని పొందగలమనే ధీమాతో ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా అంబికా సోనీ చెప్పారు. బిజెపి నేతృత్వంలోని మతవాదులతో జత కట్టేది లేదని జెడి - యస్ అధినేత దేవెగౌడ స్పష్టమైన ప్రకటన చేశారని, ఇది హర్షణీయమని ఆమె అన్నారు.