చర్చలు విఫలమైతే కురుక్షేత్ర తప్పదు: మంద కృష్ణ
హైదరాబాద్: ఎస్సి రిజర్వేషన్ల కోసం సోనియా గాంధీ స్పష్టమైన ప్రకటన కోసం పట్టుబడుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యం ఆర్పియస్) నేత మందకృష్ణ మాదిగ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. సీనియర్ న్యాయవాది కన్నాభిరాన్ అందుబాటులో లేకపోవడం వల్లనే ఉదయం ముఖ్యమంత్రితో చర్చలకు తాను రాలేదని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చలు విఫలమైతే ప్లీనరీ వద్ద తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన చెప్పారు.
ఒక వైపు చర్చలకు పిలుస్తూ మరో వైపు తాము తలపెట్టిన కురుక్షేత్ర సమరాన్ని విఫలం చేయడానాకి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యంఆర్పియస్) నేత మందకృష్ణ మాదిగ అన్నారు. తనను చర్చలకు పిలిచి చర్చలను విఫలం చేసి ముఖ్యమంత్రి క్యాంప్ నుంచి బయటకు రాగానే తనను అరెస్టు చేయడానికి కుట్ర చేశారని ఆయన శుక్రవారం ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్ ప్రతినిధితో అన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితో ఆయన క్యాంప్ ఆఫీసులో శుక్రవారం ఉదయం మంద కృష్ణమాదిగ చర్చలు జరపాల్సి ఉంది. అయితే తాను ఇప్పుడు రాలేనని కృష్ణ తెలియజేశారు. దీంతో చర్చలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం కూడా చర్చలు జరగలేదు. దీంతో సాయంత్రానికి వాయిదా పడినట్లు చెబుతున్నారు.
మంద కృష్ణమాదిగ తన అరెస్టును నివారించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు, కృష్ణ కోసం పోలీసులు హైదరాబాద్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు, మంద కృష్ణ మాదిగ కోసం విద్యానగర్ ప్రాంతంలో ఉన్న ప్రజాపంథా కార్యాలయం మార్క్స్ భవన్ను పోలీసులు చుట్టుముట్టినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్కు 144వ సెక్షన్ వర్తించనప్పుడు తమకెందుకు వర్తిస్తుందని మంద కృష్ణమాదిగ ప్రశ్నిస్తున్నారు. కురుక్షేత్రను భగ్నం చేయడానికి పోలీసులు నగరంలో 144వ సెక్షన్ విధించారు.
ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టమైన ప్రకటన చేయకపోతే ప్లీనరీని అడ్డుకుంటామని మందకృష్ణ మాదిగ ఇదివరకే ప్రకటించారు. ప్రకటన చేయడానికి సోనియా గాంధీకి ఆయన బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా వేశారు. ఆ గడువు ముగియడంతో కురుక్షేత్ర పేరిట ర్యాలీకి, బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కురుక్షేత్ర సమరానికి తరలి వస్తున్న మాదిగలను పోలీసులు జిల్లాల్లో ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్లోని పంజగుట్టలో యం ఆర్పియిస్ నాయకులు చేపట్టిన నిరాహార దీక్షను వారిని అరెస్టు చేసి పోలీసులు భగ్నం చేశారు.
కాగా, మాలమహానాడు నాయకులు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కలిశారు. వీరు ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. వర్గీకరణకు ముందుకు సాగవద్దని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రితో కుదిరిన ఒప్పందం మేరకు మాలమహానాడుకు చెందిన 20 మంది ప్రతినిధులు కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా సోనియాను కలిసి ఒక వినతిపత్రం సమర్పిస్తారు.