నిజమైన ద్రోహి కెసిఆర్: అసమ్మతి ఎమ్మెల్యేలు
సంగారెడ్డి: నిజమైన తెలంగాణ ద్రోహి తమ నేత కె. చంద్రశేఖర్ రావు అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యులు దుగ్యాల శ్రీనివాసరావు, బండారు శారారాణి అన్నారు. తెలంగాణ అభివృద్ధి శంఖారావం పేరిట తూర్పు జయప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో అసమ్మతి తెరాస శాసనసభ్యులు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కెసిఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఏడాదిన్నర పాటు ఢిల్లీలో కూర్చుని తెలంగాణ ప్రజలను కెసిఆర్ మభ్య పెట్టారని వారు విమర్శించారు.
కెసిఆర్వి గల్లీరాయుళ్ల కూతలని శారారాణి అన్నారు. బిజెపి బహిష్కృత నేత ఉమాభారతి చెప్పినట్లు కెసిఆర్, నరేంద్రలు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని అసమ్మతి శాసనపభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాదని, అటువంటప్పుడు తెలంగాణ అభివృద్ధి ఆగిపోకూడదని, అందుకే తాము ఈ సభను నిర్వహిస్తున్నామని వారు చెప్పారు. వైయస్ను పొగిడింది, పనుల కోసం చుట్టూ తిరిగింది కెసిఆర్, నరేంద్రలేనని వారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది కెసిఆర్, నరేంద్రలేనని దుగ్యాల శ్రీనివాసరావు అన్నారు. రాజీనామా చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కెసి ఆర్, నరేంద్రలను తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. పావలా, అర్థరూపాయి వసూలు చేసే గుండా నాయని నర్సింహారెడ్డికి తమను విమర్శించే హక్కులేదని బండారు శారారాణి అన్నారు. కెసిఆర్ వద్ద ఎంగిలి మెతుకులు ఏరుకుతునే నాయని నర్సింహారెడ్డి ఏదో మాట్లాడాలి కాబట్టి తమపై అనర్థమైన వ్యాఖ్యలు చేశారని ఆమె అన్నారు.