ప్లీనరీలో తెలంగాణపై ఎవరైనా మాట్లాడొచ్చు: వైయస్
హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్లీనరీలో తెలంగాణపై ఎవరైనా మాట్లాడవచ్చునని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. గచ్చీబౌలిలో ఎఐసిసి ప్లీనరీ కోసం జరిగిన ఏర్పాట్లను ఆయన శుక్రవారంనాడు పరిశీలించారు. షెడ్యూల్డ్ కులాల ( ఎస్సి) రిజర్వేషన్ల వర్గీకరణపై కూడా ఎవరైనా మాట్లాడవచ్చునని ఆయన అన్నారు.
హైదరాబాద్లో జరిగే ప్లీనరీ సమావేశాలు దేశానికి, రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తాయని ఆయన అన్నారు. రేపు ప్రారంభమయ్యే ఎ ఐసిసి స్లీనరీ కోసం గచ్చిబౌలిలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ( ఎసిపిజి) ఇప్పటికే ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. 14 వేల మంది ప్రతినిధులకు అవసరమైన వసతి, భోజన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
ఇదిలావుంటే, గచ్చీబౌలిలో శుక్రవారం స్వల్ప అపశృతి దొర్లింది. వి ఐపిలు కూర్చుండే వేదికకు సమీపంలో గల ఎసి మిషన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఎగిశాయి.