లెఫ్ట్తో దోస్తీ కేంద్రానికే పరిమితం: ఎఐసిసి
హైదరాబాద్: వామపక్షాలతో స్నేహం కేంద్రానికి మాత్రమే పరిమితమని, స్థానికంగా వామపక్షాలతో పోరాటం ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆదివారం ప్లీనరీలో ప్రతిపాదించిన రాజకీయ తీర్మానంలో ఈ మేరకు కాంగ్రెస్ స్పష్టం చేసింది. జాతీయ అవసరాల దృష్ట్యా కేంద్రంలో సెక్యులర్ పార్టీలతో కలిసి పని చేయాలని అభిప్రాయపడింది. తాము సంకీర్ణ ధర్మానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. మిత్రపక్షాలతో విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలియజేసింది.
కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు జరిగే శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలతో అవగాహన ఉండదని, వామపక్షాలపై హోరాహోరీ పోరాటం వుంటుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేని ఏ పార్టీతోనైనా తాము కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
సీమాంతర ఉగ్రవాదంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ఆందోళన వ్యక్తం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహం అందించబోనని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్పై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ముందడుగు వేయగలదని ఆశించింది. కాశ్మీరీ పండిట్ల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.