మావోయిస్టుల కారిడార్ ముప్పు: కాంగ్రెస్
హైదరాబాద్: తగిన పరిస్థితుల్లో చర్చలకు తలుపులు మూయకుండానే నక్సలైట్ సమస్య కచ్చితమైన, స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నక్సలైట్ హింస ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని తన ప్లీనరీ సెషన్లో ఆదివారంనాడు ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంలో అభిప్రాయపడింది. నక్సలైట్ల హింస పెరిగిపోతుండడం పట్ల, నేపాల్లోని మావోయిస్టులతో దేశంలోని నక్సలైట్లకు గల సంబంధాల పట్ల కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ స్థితిలో నక్సలైట్ సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వాన్ని కోరింది.
నేపాల్ సరిహద్దుల నుంచి భారత ప్రధాన భూభాగం గుండా ఆంధ్రప్రదేశ్ వరకు మావోయిస్టులు తలపెట్టిన కారిడార్ భారత ప్రజాస్వామ్యానికి, ప్రజల శాంతియుత సహజీవనానికి అత్యంత ప్రమాదకరమైందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. నేపాల్లోని మావోయిస్టులతో భారతదేశంలోని మావోయిస్టుల సంబంధాలు ఇరు దేశాల భద్రతకు ముప్పు తెచ్చి పెడతాయని అన్నది. సామాజిక ఆర్థిక అంశాన్ని వదిలేయకుండా నక్సల్స్ సమస్యను తీవ్రమైన శాంతిభద్రతల సమస్యగా పరిగణించాలని కాంగ్రెస్ పేర్కొంది.