పాక్, భారత్ల రెండో టెస్టు కూడా డ్రా
ఫైసలాబాద్: పరుగుల వరదతో పాకిస్థాన్, భారత్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో జహీర్ఖాన్ నాలుగు వికెట్లు వెంటవెంటనే తీసుకోవడం విశేషం. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ ముగియకుండానే మ్యాచ్ ముగిసిపోతుందనుకున్న తరుణంలో భారత బౌలర్లు కొత్త బంతితో వెంటవెంటనే ఐదు వికెట్లు తీశారు. ఈ ఐదు వికెట్లలో ఒక వికెట్ ఆర్.పి. సింగ్కు రాగా, నాలుగు వికెట్లు జహీర్కు పడ్డాయి. ఆశ్చర్యకరంగా షాహిద్ ఆఫ్రిదీ ఒక పరుగు మాత్రమే చేసి జహీర్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇది పాకిస్థాన్ అభిమానులను ఎంతో నిరాశపరిచింది. ఆఫ్రిదీ అవుట్ కాగానే ప్రేక్షకులు చాలా మంది వెళ్లిపోవడం మొదలు పెట్టారు.
భారత బౌలర్లు 16 బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నారు. యూనిస్ఖాన్ మరోసారి డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. అతను 194 పరుగులకు అవుటయ్యాడు. యూసుఫ్ 126 పరుగులు చేశాడు. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 490 పరుగులు చేసింది. ఇంజమామ్, సలీం మాలిక్ బ్యాటింగ్కు రాలేదు. ఓపెనర్గా దిగిన కమ్రాన్ అక్మల్ 78 పరుగుల చేసి అవుటయ్యాడు. పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్లో 588 పరుగులు చేయగా, భారత్ 603 పరుగులు చేసింది.
భారత్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్ట పోకుండా 21 పరుగులు చేసింది. సెహ్వాగ్ స్థానంలో వివియస్ లక్ష్మణ్ ఓపెనర్గా దిగాడు. లక్ష్మణ్ ఎనిమిది పరుగులతోనూ, ద్రావిడ్ ఐదు పరుగులతోనూ నాటవుట్గా మిగిలారు. ఆఫ్రిదీ, యూనిస్ఖాన్లు కొంతబంతితో బౌలింగ్ చేశారు. ఆఫ్రిదీ బౌన్సర్లతో అదరగొట్టాడు. ఆఫ్రిదీ వేసిన ఒక బంతి లక్ష్మణ్ హెల్మెట్కు తాకింది. ద్రావిడ్ వికెట్ కీపర్ గ్లౌజులు తొడుక్కొని మహేంద్ర సింగ్ ధోనీతో కూడా బౌలింగ్ చేయించాడు.