బూటా బర్తరఫ్కు టిడిపి డిమాండ్
విశాఖపట్నం/ న్యూడిల్లీ: బీహార్ అసెంబ్లీ రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ బూటాసింగ్ను బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు డిమాండ్ చేశారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పి బూటాసింగ్ను తప్పించాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నిజానికి మన్మోహన్ మంత్రివర్గమంతా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఇది అని ఆయన అన్నారు.
బూటాసింగ్ తొలగింపు విషయంలో ఇంత తాత్సారం చేశారంటే అది రాజ్యాంగానికి, దేశానికి మంచిది కాదని ఆయన అన్నారు. గవర్నర్ల వ్యవస్థపై వచ్చే పార్లమెంటు సమావేశంలో చర్చ జరపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, బూటాసింగ్ను తొలగించాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డి ఎ) నాయకులు బుధవారం రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ను కోరారు. ఎల్.కె. అద్వానీ నేతృత్వంలోని యన్డిఎ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసింది.