బలపరీక్షకే ధరమ్సింగ్ మొగ్గు?
బెంగుళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి ధరంసింగ్ శాసనసభలో విశ్వాస పరీక్షకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. విశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం తాను సమాధానమిచ్చి ధరం సింగ్ రాజీనామా చేస్తారని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన బలపరీక్షను ఎదుర్కోవడానికే సిద్ధపడినట్లు తెలుస్తోంది. కుమారస్వామి నేతృత్వంలోని జెడి-యస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ధరమ్ సింగ్ ప్రభుత్వం దాదాపుగా మెజారిటీ కోల్పోయినట్లే. అయితే ఆయన ఏ ధైర్యంతో బలపరీక్షకు సిద్ధపడుతున్నారనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.
విశ్వాస తీర్మానంపై ఓటింగ్ను ధరమ్ సింగ్ జాప్యం చేస్తున్నారని బిజెపి విమర్శించింది. విశ్వాస తీర్మాన ప్రతిపాదనలో ధరమ్ సింగ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని బిజెపి నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు విమర్శించారు. అసెంబ్లీ కార్యక్రమాల ఎజెండాలో తీర్మానాన్ని చేర్చకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. ఓటమిని తప్పించుకోవాలని ధరమ్ సింగ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. విశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వం అత్యంత ప్రధానమైన అంశంగా చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన విధుల్లో ఎందుకు విఫలమైందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తాము కర్ణాటక అపెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధమని కాంగ్రెస్ నాయకుడు అంటోని ప్రకటించారు.