ప్రణబ్ వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకం: వెంకటస్వామి
న్యూఢిల్లీ: తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయడం సాధ్యం కాదని రక్షణ మంత్రి, తెలంగాణపై ఏర్పాటయిన యుపిఎ సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ ప్రకటించడం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) తీర్మానానికి వ్యతిరేకమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పెద్దపల్లి లోక్సభ సభ్యుడు జి. వెంకటస్వామి వ్యాఖ్యానించారు. రెండో ఎస్సార్సీకి అంగీకరించిన తెలంగాణ రాస్ట్ర సమితి (తెరాస) నాయకులు ఇప్పుడు ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పునరుద్ధరణ బిల్లుకు మద్దతు కోసం సిపియం నాయకులతో సోనియా గాంధీ మాట్లాడారని, సిపియం అందుకు మద్దతు తెలియజేసిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సిపియం అనుకూలంగా లేదని ఆయన చెప్పారు. ప్రాణహిత చిరునామా తెలియని తెలుగుదేశం నాయకుడు దేవేందర్ గౌడ్ పాదయాత్ర చేపట్టడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.