భారీ విస్తరణ: 3గురు ఆంధ్రులకు చోటు
న్యూఢిల్లీ: గత 20 నెలల కాలంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తొలిసారి భారీగా తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా తన మంత్రివర్గంలోకి 19 మందిని తీసుకున్నారు. ఇందులో ఏడుగురు క్యాబినెట్ మంత్రులు కాగా, 12 మంది సహాయ మంత్రులు. ముగ్గురు సహాయ మంత్రులకు క్యాబినెట్ హోదా కల్పించారు. మంత్రి వర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురికి స్థానం లభించింది. టి. సుబ్బరామిరెడ్డి, పురంధరేశ్వరి, పల్లంరాజులను ఆంధ్రప్రదేశ్ నుంచి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు కూడా సహాయ మంత్రులుగానే పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జైరామ్ రమేష్ కూడా సహాయ మంత్రిగా స్థానం దక్కింది.
కొత్త మంత్రుల చేత, క్యాబినెట్ హోదా పొందిన మంత్రుల చేత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరాంచల్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించలేదు. ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు గంట సమయం పట్టింది. ఈ కార్యక్రమానికి4 కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీ, తదితరులు హాజరయ్యారు. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, లోక్జనశక్తి నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్, నేషనలిస్టు కాంగ్రెస్ నాయకుడు శరద్ పవార్ హాజరు కాలేదు. ఈ ముగ్గురు కూడా యుపి ఎ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములే. లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శిబూ సోరేన్కు మంత్రివిస్తరణలో చోటు కల్పించారు. అలాగే స్వర్గీయ జి.కె. ముపనార్ కుమారుడు జి.కె. వాసన్కు సహాయ మంత్రిగా స్థానం దక్కింది.
కొత్త మంత్రులు: సుశీల్ కుమార్ షిండే, ఎ. ఆర్. అంతులే, వాయలార్ రవి, మురళీ దొర, అంబికా సోనీ, సైఫుద్దీన్ సోజ్, శిబూ సొరేన్. సంతోష్ మోహన్ దేవ్, ప్రేమ్చంద్ గుప్తా, కపిల్ సిబాల్లకు క్యాబినెట్ హోదా కల్పించారు.
సహాయ మంత్రులు: పవన్ కుమార్ బన్సాల్, సుబ్బిరామిరెడ్డి, ఆనంద్ శర్మ, అజయ్ మేకెన్, ఎం. పల్లంరాజు, చంద్రశేఖర్ సాహు, అఖిలేష్ దాస్, జైరామ్ రమేష్, అశ్విని కుమార్, పురంధరేశ్వరి, దిన్షా పటేల్.