విస్తరణలో తెలంగాణకు అన్యాయం: వెంకటస్వామి
హైదరాబాద్: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పెద్దపల్లి లోక్సభ సభ్యుడు జి. వెంకటస్వామి విమర్శించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు కూడా అన్యాయం జరిగిందని ఆయన ఒక ప్రైవేట్ తెలుగు టీవీ ఛానల్ ప్రతినిధితో అన్నారు. వెనకబడిన తరగతులకు, షెడ్యూల్డ్ కులాలకు, మైనారిటీలకు మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి స్థానం దక్కకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. బిసిల నుంచి వి. హన్మంతరావుకు స్థానం దక్కుతుందని ఆశించామని ఆయన అన్నారు.
మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిన విషయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాల దృష్టికి తీసికెళ్తానని ఆయన చెప్పారు. మంత్రివిస్తరణలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయం వచ్చే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఎక్కువ మంది లోక్సభ సభ్యులు గెలవని రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం ఇచ్చి, ఎక్కువ స్థానాలు గెలిచిన రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఆయన అన్నారు.