కోరిన 15 రోజుల్లో పని కల్పిస్తాం: మన్మోహన్
అనంతపురం: ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోగా పని కల్పించకపోతే కోర్టుకు వెళ్లవచ్చునని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో డాక్టర్ మన్మోహన్ సింగ్, ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్పర్సన్ సోనియా గాంధీ గురువారంనాడు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ఉపాధి హామీ పథకంతో దారిద్య్రాన్ని నిర్మూలిస్తామని మన్మోహన్ సింగ్ చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి వంద రోజులు పని కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామసభల్లో పనుల నిర్ణయం జరుగుతుందని ఆయన చెప్పారు.
దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో పని కల్పిస్తామని, పదిహేను రోజుల్లోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి లభిస్తుందని ఆయన చెప్పారు. యంత్రాలు, కాంట్రాక్లర్ల ద్వారా పనులు జరగవని ఆయన చెప్పారు. దళారులను నివారించడానికి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా కూలీ డబ్బులు చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందడానికి సమాచార హక్కును వినియోగించుకోవచ్చునని ఆయన చెప్పారు. పద్నాలుగు రోజుల లోపు కూలీ చెల్లింపు జరుగుతుందని ఆయన చెప్పారు.
ఉపాధి హామీ పథకం అమలు విషయంలో పంచాయతీలదే తుది నిర్ణయమని సోనియా గాంధీ అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. లోపాలుంటే అధికారులను నిలదీయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించి నవభారత్ను నిర్మిస్తామని ఆమె చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద చెరువుల పూడికతీత, కానుగచెట్ల పంపకం చేపట్టాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సూచించారు. మూడేళ్లలో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తామని ఆయన చెప్పారు.
ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఈ పథకం అమలవుతుంది.