ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుంది: పొన్నాల
హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీని కొనసాగిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ఉచిత విద్యుత్ సరఫరా ఐదేళ్లు కొనసాగుతుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ పంపిణీని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ సమక్షంలో ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు.
రైతులు మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలనే ప్రభుత్వం ఆదేశాలపై తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, తెలుగుదేశం వ్యవహార సరళి దాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. తొమ్మిదేళ్లు అధికారం చేసిన తెలుగుదేశం నాయకులకు ఇప్పుడు అధికారం లేకపోయేసరికి మతిభ్రమించిందని, అందుకే అర్థరహితమైన విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు.