నక్సల్స్ కిడ్నాప్ చేస్తారా, నేను రెడీ: ఎమ్మెస్సార్
వరంగల్: తనను మావోయిస్టులు కిడ్నాప్ చేయదలుచుకుంటే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు లక్ష్మీకాంతరావును ఆయన శుక్రవారంనాడు కలుసుకున్నారు. "నన్ను మావోయిస్టులు కిడ్నాప్ చేస్తారా, చాలా సంతోషం. వారు కిడ్నాప్ చేయడం సంతోషం అని ఆయన అన్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలో కాస్తో కూస్తో వారికి అనుకూలంగా మాట్లాడుతున్నది తానేనని, తనను కిడ్నాప్ చేస్తే సంతోషమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తనను కిడ్నాప్ చేస్తే తాను వారి క్యాంపులో ఉంటానని, వారి కార్యకలాపాలను పరిశీలిస్తానని, తప్పులుంటే చెప్తానని ఆయన అన్నారు. మంచి పనులు చేయాలని తాను నక్సల్స్కు చెప్తానని, ఇలా చేస్తే విజయం సాధించలేరని వారికి చెప్తానని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్లీనం వల్ల గచ్చిబౌలి స్టేడియం నాశనమైందనే తెలుగుదేశం పార్టీ విమర్శలను ఆయన అంతకు ముందు ఖండించారు. గచ్చిబౌలీ స్టేడియం ఏ మాత్రం పాడు కాలేదని ఆయన అన్నారు. ఒక వేళ నాశనమైతే ఎన్ని డబ్బులైనా పెట్టి బాగు చేయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.