లంచం కేసులో ఎసిబి అదుపులో పాలకొల్లు సిఐ
హైదరాబాద్: సాక్ష్యాలను అనుకూలంగా మార్చడానికి లంచం తీసుకున్న వ్యవహారంలో ప్రమేయంపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు పాలకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) బోసును అదుపులోకి తీసుకున్నారు. వినోద్ రెడ్డి అనే వ్యక్తి నుంచి పాలకొల్లు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) సుభానీ ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
ఒక ఎన్నారైకి సంబంధించిన కేసులో సాక్ష్యాలు అనుకూలంగా మార్చడానికి పోలీసులు ఐదు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారని, దీంతో ఈ విషయాన్ని సదరు వ్యక్తి తమకు తెలియజేశాడని ఎసిబి అధికారులు చెప్పారు. హైదరాబాద్లోని ఆబిడ్స్ ప్రాంతానికి లంచం తీసుకోవడానికి సుభానీ వచ్చాడని వారు చెప్పారు. సుభానీ మీడియాతో ఏ విషయాలూ మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. సుభానీ చెప్పిన విషయాలతో సి ఐని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ఉంచినట్లు సమాచారం.