తెలంగాణకు సిపియం కూడా సానుకూలం: నరేంద్ర
మెదక్: తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదించడానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్పై, ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్పర్సన్ సోనియా గాంధీపై ఒత్తిడి తెస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
తెలంగాణ ఏర్పడితే ఉనికి కోల్పోతామనే భయంతోనే తెలుగుదేశం పార్టీ జలసాధన పాదయాత్ర చేపట్టిందని ఆయన విమర్శించారు. 15 ఏళ్లుగా గుర్తు రాని ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే గుర్తుకు వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన పిపియం ఇప్పుడు సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు గురించి తాము ఆలోచించడం లేదని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము 2 లక్షల మందితో ఆందోళన చేస్తామని ఆయన అన్నారు.
ప్రభుత్వ కుట్రలో భాగంగానే తమ పార్టీ అసమ్మతి శాసనసభ్యులు అభివృద్ధి శంఖారావం సభను నిర్వహించారని ఆయన అన్నారు. అసమ్మతి శాసనసభ్యులు దారికి వస్తున్నారని, పార్టీలోని ఇంటిపోరు సమసిపోతోందని ఆయన అన్నారు. తెలంగాణను ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన జలాల గురించి మాట్లాడకుండా ప్రభుత్వం పోలవరం నిర్మించిడం సరైంది కాదని ఆయన అన్నారు. 45 రోజుల్లో తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోతే తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని ఆయన చెప్పారు. తాము రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ అగ్ని గుండమే అవుతుందని ఆయన అన్నారు.
డిసెంబర్ 28వ తేదీ లోగా 610 జీవోను అమలు చేయకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న ఎం. సత్యనారాయణ రావు ఏం చేశారని ఆయన అడిగారు. 610 జీవో అమలు విషయంలో తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు.