తెలంగాణపై నరేంద్ర గడువు ఇది 45వ సారి: కెకె
తిరుపతి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత ఎ. నరేంద్ర గడువు విధించడం ఇది 45 సారి అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 45 రోజుల్లో చర్యలు చేపట్టకపోతే యుపిఎ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని నరేంద్ర శనివారంనాడు ప్రకటించిన విషయం తెలిసిందే. నరేంద్రపై ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల వద్ద తీవ్రంగా ధ్వజమెత్తారు.
తెరాస కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఏమీ కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఏమైందో, కేంద్రం నుంచి వైదొలిగితే అదే అవుతుందని ఆయన అన్నారు. తెరాస నాయకులు ఉద్వేగభరితమైన ప్రకటనలు చేస్తున్నారని, వారు పదజాలం మార్చుకోవడం అవసరమని ఆయన అన్నారు. తెరాస నాయకులు మాట్లాడుతున్న విషయానికి తెలంగాణకు పొంతన లేదని, తెలంగాణ అంశం వారు మాట్లాడుతున్నదానికి భిన్నమైందని ఆయన అన్నారు. సోనియా చేతిలో పెట్టిన తర్వాత ఆమె ప్రకటన చేసేవరకు ఆగాల్సి ఉందని ఆయన అన్నారు.