ఉచిత విద్యుత్తు అమలు మా ఘనత వల్లే: టిడిపి
హైదరాబాద్/ కరీంనగర్: తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన విద్యుత్ సంస్కరణల ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ను అందించగలుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత ఇంధన శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్వయంగా చెప్పారని, అయినా అదేదో తమ గొప్ప తనమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని వారు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపుతోందని వారు విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ జిల్లాల్లో చేపట్టిన గోదావరి జల సాధన పాదయాత్ర ఆదివారంనాడు తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఆదివారంనాడు ఈ పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ ఈ సందర్భంగా విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తాము ఆందోళనలకు దిగితే సమస్యలను పరిష్కరించడానికి బదులు కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించి తమను తిడుతోందని ఆయన అన్నారు.